29-05-2025 11:03:03 PM
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు..
మందమర్రి (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana Agricultural University) వారి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు పంట సాగుపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పులిమడుగు గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి నాగరాజు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడిఏ) బి ప్రసాద్ లు మాట్లాడుతూ... రైతుల అభ్యున్నతికి, వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులకు చేరవేసే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రైతులకు తక్కువ యూరియా వాడటం, సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటం, రశీదులను భద్రపరచడం, కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందటం, సాగు నీటిని ఆదా చేయడం, భావితరాలకు అందించడం, పంట మార్పిడి పాటించడం, సుస్థిర ఆదాయాన్ని పొందటం, చెట్లను పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం గ్రామాల్లో సాగు చేస్తున్న ప్రధాన పంటలను ఆశించే చీడపీడలు, వాటి యాజమాన్యంపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిని అనిత మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. మ్యాట్రిక్స్ కంపెనీ సిఈఓ ఉదయ్ కుమార్ వారు మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ పంట సాగు పైన అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు, మాజీ ఎంపిటిసి తిరుపతి, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.