19 April, 2026 | 7:57 AM

అక్రమ ఫైనాన్స్, చిట్టీలు నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో సోదాలు

16-05-2025 12:00 AM
  1. 62 ఖాళీ బ్యాంక్ చెక్కులు, 82 ప్రామిసరీ నోట్లు స్వాధీనం... ఆరుగురిపై కేసు నమోదు
  2. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 15 (విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇండ్లలో గురువారం ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసులు సోదాలు నిర్వహించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలోని పాకబండ బజార్, టిన్జీవోస్ కాలనీ,వేణుగోపాలనగర్, పంపింగ్ వెల్ రోడ్డు,గాంధీనగర్, ఆల్లీపూరం, కొత్తగూడెం, మంచుకొండ ప్రాంతాలలో నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆనాధికార చిట్స్, అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో 8 చోట్ల దాడులు , తనిఖీలు నిర్వహించామన్నారు.

లక్షల విలువ చేసే 62 ఖాళీ బ్యాంక్ చెక్స్, 82 ప్రాంసరీ నోట్లు, 12 చిట్టి బుక్స్ లభ్యమయ్యాయినట్లు తెలిపారు.చిట్ నిర్వహుకులు తమ కస్టమర్ల నుండి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసి ఆరుగురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై ఖమ్మం వన్ టౌన్ ,టూ టౌన్, ఖానపూరం హవేలీ,రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు.

ప్రజల అవసరాలను అసరగా తీసుకొని గిరిగిరి పేరుతో అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ఎవరైనా ఆనాధికార చిట్టిలు, అక్రమ ఫైనాన్స్ /గిరిగిరి నిర్వహిస్తే స్ధానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.