calender_icon.png 28 January, 2026 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు

28-01-2026 03:48:05 PM

- జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా మెదక్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులు (Proposers) మాత్రమే అనుమతించబడతారని తెలిపారు. అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.

సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్ఐలు లింగం, విఠల్, మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.