రైతు వేదికల్లో విత్తనాల మేళా
రైతులకు అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
తంగళ్లపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు రైతు వేదికల్లో విత్తనాల మేళా ప్రారంభమైంది. తంగళ్లపల్లి, బదనపల్లి, జిల్లెల రైతు వేదికలలో రైతులు తమకు అవసరమైన విత్తనాలను నేరుగా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్న వరి విత్తనాలకు ప్రత్యేక బోనస్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
అదనంగా పత్తి, కంది, కూరగాయల విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉంచారు.విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా రసీదులను భద్రపరచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, బోనస్లు మరియు ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొనుగోలు రసీదులు అవసరమవుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు రైతు వేదికలను సందర్శించి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.






