ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్
ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని వైసీఓఏ లేడీస్ క్లబ్లో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలను లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు వి. రమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు అలంకరించుకుని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వి. రమ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల సౌభాగ్యం, ఆరోగ్యం, శుభానికి సంకేతంగా భావిస్తారని తెలిపారు.
గోరింటాకు శరీరంలోని వేడిని తగ్గించి వర్షాకాలంలో వచ్చే కొన్ని చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. అనంతరం మహిళల కోసం గోరింటాకు పోటీలు నిర్వహించి అందంగా అలంకరించుకున్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణలో సుశీల, లత, శ్యామల సమన్వయం చేయగా, విజేతలకు లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు వి. రమ బహుమతులు అందించి అభినందించారు.






