29 July, 2026 | 6:31 PM

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక

29-07-2026 06:01 PM

సింగూర్ నీటి రంగు మార్పు.. తాగొద్దని మున్సిపల్ కమిషనర్ సూచన

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి సింగూర్ జలాశయం నుంచి సరఫరా అవుతున్న తాగునీటి రంగు మారి వస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అత్యవసర సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిని ఇంటి సాధారణ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, త్రాగునీటిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని ప్రజలకు సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని, మరో మూడు రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అప్పటి వరకు పట్టణ ప్రజలందరూ సహకరించి, తాగేందుకు సురక్షితమైన ప్రత్యామ్నాయ నీటినే వినియోగించాలని, మున్సిపాలిటీ జారీ చేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.