calender_icon.png 9 June, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

08-06-2025 11:18:21 PM

కలెక్టర్ ఆదేశాలను పాటించకుండా... పెద్దఎత్తున మట్టి అక్రమ రవాణా..

జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లో మట్టి మాఫియా డాన్ లు రేచ్చిపోతున్నారు. జిల్లాలో సహజ వనరులైన మేట వేసిన ఇసుక, సన్నటి ఎర్ర ఇసుక, దుబ్బ, మట్టి, మొరం అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇంకేముంది ఈ మట్టి మాఫియా గాళ్లు కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో చూస్తుండగానే కోట్లకు పడుగెత్తుతున్నారు. దీంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలోని గుట్టలను, మానేరు వాగులో ఇసుకను, అటవీ భూముల నుండి, ప్రభుత్వ పట్టా భూముల నుండి సహజ వనరులను ఎటువంటి అనుమతి లేకుండానే రాత్రి, పగలు తేడాలేకుండా దొసుకుంటూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, అంతర్గాంతో పాటు తదితర మండలాలలోని గ్రామాలలోని చెరువులలో ప్రొక్లెయినర్లు, జేసీబీలతో త్రవ్వకాలు చేపడుతూ టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి తరలిస్తూ అందినకాడికి జేబులు నింపుకుంటున్నారు. సామాన్య ప్రజలు మాత్రం  సొంత అవసరాల కోసం మట్టి, మొరం, ఇసుక తీసుకునేందుకు తహసీల్దార్ లు అనుమతి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఫిబ్రవరి 10వ తేదీన జిల్లాలోని తహసీల్దార్ లకు ఆదేశాల జారీ చేశారు. ఒక ట్రాక్టర్ కు రూ. 200 రూపాయలు, టిప్పర్ కు రూ. 800 రూపాయల రుసుము తహసిల్దార్ లకు చెల్లించిన తరువాత అనుమతి పొందాలని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టి  తరలించాలని, ఆదివారం, సెలవు దినాలలో మట్టి తరలింపుకు అనుమతి లేదని,  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

అయినప్పటికీ, మాఫియా గాళ్లు అక్రమంగా సన్నటి ఇసుక, ఎర్ర మట్టి, మొరం దందా మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని, ఈ అక్రమ మట్టి దందా నిర్వహించే అక్రమార్కులను మాత్రం సంబంధిత శాఖలు అరికట్టడంలేదన్న విమర్శలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలం అవుతున్నారు.  ప్రభుత్వానికి ఎటువంటి సీనరేజ్ ఛార్జీలు చెల్లించకుండా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతూ, అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్నారని, ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి జోరుగా కొనసాగుతుందని, సెలవు దినాలైనా శనివారం, ఆదివారంలతో పాటు ప్రభుత్వ సెలవు దినాలలో పగలు, రాత్రి అనకుండా అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్నారు.

సంబంధిత శాఖలు స్పందిచకపోవడంతో అనుమానాలు రేఖ ఎత్తుతున్నాయి. ప్రభుత్వంలోని బాధ్యతాయుతమైన ఓ కీలక శాఖ మాత్రం తమ శాఖ కు సంబంధించింది కాదని చేతులు దులిపి వేసుకుంటున్నారు. కనీసం ఎవరైనా పౌరులు ఫోన్ లో గాని సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమ శాఖ అధికారులు తమ శాఖలో తగినంత స్టాఫ్ లేదని, ఒక ఫీల్డ్ వద్దకు వెళ్లినా తమకు సెక్యూరిటి లేదని, రక్షణ లేదని పలువురు మండల స్థాయి అధికారులు పాత్రికేయులకే చెప్తున్నారు. అక్రమ మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేస్తే, స్పందించడం లేదనే విమర్శలున్నాయి. అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్పందించి, చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్  సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.