28 February, 2026 | 8:03 PM

వాహన డ్రైవర్లకు నయనం ప్రధానం

28-02-2026 05:41 PM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

కేసముద్రం (విజయక్రాంతి): ప్రతి డ్రైవర్‌కు స్పష్టమైన కంటిచూపు అత్యంత అవసరమని, కంటిచూపు లోపాలు రోడ్డు ప్రమాదాలకు ఒక ప్రధాన కారణమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శనివారం కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా అగర్వాల్ హాస్పిటల్ సౌజన్యంతో లారీ, ఆటో, డీసీఎం, గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు తమ కంటి చూపును తరచుగా పరీక్షించించుకోవడం ద్వారా కంటి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగం, నిర్లక్ష్యపు, ర్యాష్ డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.

అలాగే వాహనాలలో అధిక లోడ్‌తో ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా లారీ డ్రైవర్లు, ఎక్కువ దూరం వాహనాలు నడిపే డ్రైవర్లు నిద్రమత్తు వచ్చినప్పుడు వెంటనే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు. అలసటతో లేదా నిద్రమత్తులో వాహనం నడపడం తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు.

ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ జర్నలిస్టులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అడ్మిన్ గండ్రతి మోహన్, కేసముద్రం సీఐ సత్యనారాయణ, కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి ఎస్ఐలు క్రాంతి కిరణ్, రమేష్ బాబు, కరుణాకర్, నరేష్ పోలీస్ సిబ్బంది, డాక్టర్ అగర్వాల్స్ కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.