ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్
- ఏటా రెండు దఫాలు నిర్వహణ
- విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ఇకపై ప్రత్యేక టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా రెండు సాధారణ (బీఎ డ్, డీఎడ్ అభ్యర్థులకు నిర్వహించే) టెట్లకు అదనంగా మరో రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో తమకు స్పెషల్ టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్టీఎఫ్, ఎస్టీయూ టీఎస్, టీఎస్ యూటీఎఫ్, హెచ్ఎం అసోసియేషన్, టీపీటీఎఫ్తోపాటు ఇతర సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఈ పరీక్షలో పేపర్ సిలబస్ను సబ్జెక్ట్ల వారీగా నిర్వహిస్తేనే ఉపయోగం ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహిస్తే కేవలం అర్హతగా మాత్రమే పరిగణించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సం ఘం ప్రభుత్వాన్ని కోరింది. డీఎస్సీలు నిర్వహించినప్పుడు నిరుద్యోగులకు వెయిటేజీ ఉంటుంది కాబట్టి.. టెట్ కఠినంగా ఉంటుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్లో వెయిటేజీ ఇవ్వకూడదని పేర్కొన్నారు.






