జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మంచినీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్స్, ఎస్సీ, ఎస్టీ ఆవాసాలలో సిమెంట్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే 99 రోజుల ప్రణాళికలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా నీటి సమస్యలపై ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. పైప్లైన్, వాల్వ్ లీకేజీలను వెంటనే సరిచేసి నీటి వృథాను నివారించాలని, ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రపరచాలని తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం బోర్ వెల్స్ వద్ద రీచార్జ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.
99 రోజుల కార్యాచరణలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రైతులకు ఫామ్ పాండ్స్ నిర్మాణం, కూరగాయల సాగు కోసం పందిళ్ల ఏర్పాటు ప్రోత్సహించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల సర్వేను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇంట్రా ఈఈ సురేందర్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డివిజనల్ పంచాయతి అధికారి మల్లికార్జున రెడ్డి, అన్ని మండలాల ఎంపిడిఓలు, మిషన్ భగీరథ ఇంజినీర్లు పాల్గొన్నారు.






