18-07-2025 12:00:00 AM
కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 17, (విజయక్రాంతి):అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినపేట గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది.
ఇట్టి సోదాలలో సుమారుగా రూ 4 వేల విలువ గల గుడుంబాను,రూ 15వేల విలువ గల మద్యం బాటిళ్లను, రూ 3,500 విలువ గల గుట్కాలను సీజ్ చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. సరిగ్గా పత్రాలు లేని 65 వాహనాలకు రూ 8,900 జరిమానాను విధించమన్నారు. గంజాయి వంటి ప్రభుత్వం నిషేధిత పదార్థాలను కనుగొనడానికి నార్కోటిక్ డాగ్స్ ద్వారా సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
మట్కా,జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు. ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచ బడతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందిక పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.