15-09-2025 07:08:11 PM
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి
గద్వాల (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision)-2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ. లతో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై సన్నాహక సమావేశం జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈ.సీ.ఐ) నుండి ఆదేశాల అందిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీ.ఈ.ఓ సూచించారు. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా సన్నద్ధం కావాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు,బీ.ఎల్.ఓలకు శిక్షణలు అందించాలని అన్నరు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ బి.యం.సంతోష్ అదనపు కలెక్టర్ లక్మినారాయణ, ఆర్.డి.ఓ. అలివేలు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.