మహిళల ఆర్థిక సాధికారతకు కృషి
స్వయం సహాయక బృందాలకు రుణాల పరిమితి పెంపు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా కృషి చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు అందిస్తున్న రూ.5 లక్షల రుణాల పరి మితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. గురువారం ప్రజాభవన్లో నిర్వహించిన స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026 ఆవిష్కరణలోపాల్గొని మాట్లాడారు.
ఈ ఏడాది రూ.26,621.47 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2025 రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళా సంఘాలు రుణాల రీపేమెంట్లో అద్భుతమైన క్రమశిక్షణ చూపిస్తున్నాయని, నిర్మల్ జిల్లా జీరో ఎన్పీఏ సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను అభినందించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు.






