6 July, 2026 | 1:20 AM

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక

11-06-2024 03:23 PM

గద్వాల( వనపర్తి ) విజయక్రాంతి : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులు ఉచితంగా చదివేందుకు నిబంధనల ప్రకారం లక్కి డిప్ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా కలెక్టర్ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో నిర్దేశించిన ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరేందుకు 57 సీట్లు (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతిలో చేరేందుకు 59 సీట్లు (రెసిడెన్షియల్) కేటాయించగా మొత్తం 833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

వీరిలో 33% రిజర్వేషన్లు బాలికలకు కేటాయించగా, మిగిలిన సీట్లను జనరల్ కోటాలో లక్కిడిప్ తీసినట్లు చెప్పారు. అదేవిధంగా ఆయా తరగతిలో రిజర్వేషన్లు ఉన్న బాలికలు, జనరల్ కోటాలో పది మంది చొప్పున అదనంగా వెయిటింగ్ లిస్టులో ఉంచేందుకు విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు ఆయా తరగతుల్లో చేరకుంటే ప్రాధాన్య క్రమంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తామని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారిని శ్వేతా ప్రియదర్శిని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 12న తమ దృవపత్రాలను తీసుకొని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో యస్.సి కార్పోరేషన్ ఈడీ రమేష్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారిని ఇందిర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.