21-06-2025 02:17:57 AM
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల శాఖకు నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖ
బనకచర్ల వివాదం నేపథ్యంలో ఏడాదిన్నర కింద రాసిన లేఖ బయటకు వచ్చిన వైనం
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటే.. ఒప్పుకున్నట్టుగా మినిట్స్లో పెట్టిన కేంద్రం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తుందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపిస్తున్న కేంద్రం వ్యవహారశైలిని బయటపెట్టే లేఖ ఒకటి బయటకొచ్చింది.
బనకచర్ల వివాదం నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రంగా సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఒకటిన్నర సంవత్సరాల కింద రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ కేంద్ర జలనరుల శాఖ మంత్రిత్వ శాఖ సెక్రటరీకి రాసిన లేఖ బయటపడింది.
ఇందులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే కేంద్రం తెలంగాణపై చూపిస్తున్న వివక్ష, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించే సమావేశాలకు సంబంధించిన మినిట్స్లో కనీసం తెలంగాణ డిమాండ్లకు చోటు కూడా దక్కడం లేదనే అంశాన్ని ఈ లేఖ బయటపెడుతోంది.
నాగార్జునసాగర్ డ్యామ్ తదితర అంశాలపై 2024 జనవరి 17న జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్ అంశాలను పేర్కొంటూ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ 19.1.2024 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. అయితే సమావేశంలో తెలంగాణ అధికారులు లేవనెత్తిన, డిమాండ్ చేసిన అంశాలు అందులో కనపడలేదు.
దీనిని ఆక్షేపిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి 27.1.2024 నాడు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. ఇందులో మీటింగ్లో తెలంగాణ అధికారుల బృందం లేవనెత్తిన అంశాలను మినిట్స్లో చేర్చకపోవడాన్ని ఆక్షేపించారు. అలాగే కొన్ని అంశాలను అంగీకరించకపోయినప్పటికీ.. అంగీకరించినట్టుగా మినిట్స్లో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ అభిప్రాయంపై సమాచారం ఇస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ..ప్రాజెక్టులను అప్పగించడానికి తెలంగాణ ఒప్పుకున్నట్టుగా మినిట్స్లో పేర్కొనడం తప్పు అని ఆ లేఖలో తెలిపారు.
అలాగే కృష్ణా నది జల వనరులను తాత్కాలిక పద్ధతిలో 50:50నిష్పత్తిలో వాడుకోవాలని(బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుదితీర్పు వచ్చేవరకు), కేడబ్ల్యూడీటీ ఇచ్చిన తీర్పు మేరకు కృష్ణాబేసిన్ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లను మినిట్స్లో చేర్చాలని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును 1962లో కేవలం జల విద్యుత్ కోసం నిర్మించారని, శ్రీశైలంలో 830 అడుగుల ఎండీడీఎల్ నీటిమట్టాన్ని పాటించాలని అందులో పేర్కొన్నారు.
దీంతోపాటు కేఆర్ఎంబీ 17వ సమావేశంలోనూ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని, ఈ అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లాలని, నాగార్జునసాగర్ ఎడమగట్టు భద్రతకు సీఆర్పీఎఫ్ అవసరం లేదని స్పష్టంగా చెప్పిన్పటికీ..ఇవన్నీ మినిట్స్లో చేర్చకుండా.. ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ అంగీకరించిందంటూ మినిట్స్లో చేర్చడాన్ని తప్పుపడుతూ..
వాటిని మార్చాలంటూ నీటిపారుదల శాఖ సెక్రటరీ కేంద్రాన్ని కోరడం గమనార్హం. అంటే తెలంగాణ లేవనెత్తిన అంశాలను కూడా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల మినిట్స్లో చేర్చడం లేదని స్పష్టమయ్యింది. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెబుతున్నారు.