మిట్టపల్లిలో ఉద్రిక్తత
జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగగా, మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సిన కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కావాలని ఆలస్యం చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ కౌంటింగ్ జాప్యంతో పాటు బ్యాలెట్ బాక్సులను మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకట స్వామి అరాచకమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు సైతం ప్రత్యారోపణలకు దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.




