calender_icon.png 26 June, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థలపై టెన్షన్..టెన్షన్

25-06-2025 12:11:02 AM

క్యాబినేట్లో చర్చకు రాని వైనం

హైకోర్టులో వాదనలు నడుస్తున్నందుకే..ముందస్తు ప్రక్రియ వేగవంతం చేసిన అధికారులు

సంగారెడ్డి, జూన్ 24(విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రక్రియకు అధికార యంత్రాంగం సన్నద్ధం చేస్తుండగా మరోవైపు హైకోర్టులో ఎన్నికలపై వాదనలు నడుస్తున్నందున అందరిలో టెన్షన్ నెలకొంది. అంతేగాకుండా సోమవారం క్యాబినేట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ రాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వం, మంత్రులు మాత్రం ఈనెలాఖరుకు స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర పూర్తయినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడంతో ఆశావహులంతా నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపో, మాపో అంటూ ఊరిస్తున్న ఎన్నికలకు గ్రహణం వీడుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కులగణనపై స్పష్టత వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈనెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదలై జూలైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. 

ముందస్తు ప్రక్రియ వేగవంతం...

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఓటరు జాబితాలను పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఓటరు జాబితాలను సిద్దం చేసి ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామాగ్రి జిల్లాకు చేరింది. ఇలావుండగా సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు గాను  7,23,375 మంది పురుష ఓటర్లు ఉండగా, 7,21,802 మహిళా ఓటర్లు ఉన్నారు.

మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 14,45,314 మంది ఓటర్లు ఉన్నారు. కాగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారితో పాటు, యువత ఓట్లు 29,786 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 27 మండలాలు ఉండగా అమీన్పూర్ మండలం అర్భన్ మండలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో 26 మండలాలకే జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 271 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,528 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. 

ఆశావహుల ఎదురుచూపులు...

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తయినా స్థానిక సంస్థలపై సందిగ్ధం నెలకొనడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలపై స్పష్టత వచ్చే వరకు ఉత్కంఠకు తెరపడదని భావిస్తున్నారు. గత పదేళ్ళుగా పదవులు, అధికారం లేకుండా కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ వర్గీయులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అలాగే బీఆర్‌ఎస్ పార్టీ నేతలు సైతం తమ మద్దతుదారులను ఎలాగైనా గెలిపించుకొని అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని యోచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ నాయకులు ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనా స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడే వరకు ఆశావహులందరికీ టెన్షన్ తప్పేలా లేదు.