calender_icon.png 25 June, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరు నియోజకవర్గంలో మరో రెండు కొత్త మున్సిపాలిటీలు

25-06-2025 12:13:08 AM

-ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 

-జిన్నారం మున్సిపల్ వద్దంటూ  రాళ్లకత్వాలో బీఆర్‌ఎస్ ఆందోళన

పటాన్ చెరు, జూన్ 24 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో మరో రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. మండల కేంద్రం జిన్నారంతో పాటు ఇంద్రేశం గ్రామం  మున్సిపాలిటీలుగా ఏర్పడబోతున్నాయి. ఇటీవలే ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపల్ లో సమీప గ్రామాలను విలీనం చేయనున్నారు. సోమవారం జరిగిన కెబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో  వెల్లడించారు.

ఆరు గ్రామాలతో ఏర్పడనున్న ఇంద్రేశం మున్సిపాలిటీలోకి ఇంద్రేశం, బచ్చుగూడ, ఐనోలు, రామేశ్వరంబండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల గ్రామాలు రానున్నాయి. 2011 జనాభ లెక్కల ప్రకారం ఆరు గ్రామాల జనాభ 16057 ఉంది. గ్రామాల వారిగా చూస్తే ఇంద్రేశం 5527, బచ్చుగూడెం 999, ఐనోలు 1338, రామేశ్వరంబండ 4035, పెద్ద కంజర్ల 2182, చిన్నకంజర్ల 1976 గా ఉంది. అలాగే పది గ్రామ పంచాయతీలతో జిన్నారం మున్సిపల్ కేంద్రంగా ఏర్పడనుంది.

ఇందులో జిన్నారం, జంగంపేట, కొడకంచి, మంగంపేట, ఊట్ల, సోలక్ పల్లి, రాళ్లకత్వ, శివనగర్, అండూరు, నల్తూరు గ్రామాలు ఉన్నాయి. గ్రామాల వారిగా 2011 జనాభ లెక్కల ప్రకారం జిన్నారం 3642, కొడకంచి 2127, ఊట్ల 1632, శివనగర్ 1511, సోలక్ పల్లి 1347, నల్తూరు 1286, రాళ్లకత్వ 1075, అండూరు 1211, జంగంపేట 694, మంగంపేట 727 గా ఉంది.  పది గ్రామా పంచాయతీలలోకలిపి జనాభ 15252  గా ఉంది. ప్రస్తుత జనాభ లెక్కల ప్రకారం 17956 మంది ఉన్నారు. కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపాలిటీల ఏర్పాటుపై అధికారికంగా ప్రకటించడంతో ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయకంగా వేడెక్కింది. మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఏర్పాటు అవుతాయి. రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, తమ వార్డులో ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది అనే లెక్కలు వేసుకుంటున్నారు. 

మున్సిపాలిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...

జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీ చేస్తూ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం డిమాండ్ చేసింది. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చడం దారుణం అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రాళ్లకత్వ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. గ్రామాలను మున్సిపల్  పరిధిలోకి తీసుకొచ్చి ప్రజల నడ్డి విరచే ప్రయత్నమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆది రామక్రిష్ణ, నాయకులు జింక దేవేందర్, పొత్త క్రిష్ణ, అంజిగౌడ్, సాయిగౌడ్, జింక గణేశ్, రాయిని శ్రీనివాస్, నీరుడి బాలేశ్, రాయుని మల్లేశ్, వీరేశం, రమేశ్, నర్సిహా, వెంకటేశ్, పోచయ్య తదితరులుపాల్గొన్నారు.