1 May, 2026 | 2:00 AM

కేంద్రం కుల గణనను నిర్వహించాలి

01-05-2026 12:00 AM

మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి

ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కుల గణనతో పాటు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ  సిరికొండ మధుసూదనా చారి డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.

మోదీ పీఎం అయిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిందని అన్నారు. బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మం డిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన నేప థ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న 42 శాతం బిసి రిజర్వేషన్ల పెంపుకు సంబందించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో మే 9న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ఈనెల 2న బీసీ సంఘాలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నంద గోపాల్, జక్కుల వంశీకృష్ణ, నాగుల శ్రీనివాస్ యాదవ్, సతీష్, నగేష్, తదితరులు పాల్గొన్నారు.