14-06-2025 10:40:27 PM
కొల్లాపూర్: భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగినేనిపల్లి గ్రామంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర" దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించిందని అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు అందుతున్నాయన్నారు.