calender_icon.png 25 October, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో బహుజనుల ఢంకా

25-10-2025 01:19:49 AM

  1. బహుజన రాజ్యమే టీఆర్పీ సంకల్పం
  2. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనికుమార్‌యాదవ్
  3. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఉద్యమం 
  4. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్

హనుమకొండ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో అగ్రవర్ణ పార్టీల కోటను బద్దలు కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కట్టుబడి ఉందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ యాదవ్ అన్నారు. టీఆర్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్‌ముదిరాజ్ ఆధ్వర్యంలో హనుమకొండ శారద ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జిల్లా, నియోజకవర్గ కన్వీనర్లు కో కన్వీనర్లు నియామకంపై ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీకుమార్ యాదవ్ మాట్లాడుతూ..

ఇన్నాళ్లు బీసీల పేరుతో ఓట్లు సేకరించి అగ్రవర్ణాల పక్షాన నిలిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుకు తెస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ రంగం మాత్రమే కాదు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల వరకు రిజర్వేషన్ అమలుకు టీఆర్పీ కట్టుబడి ఉందని అన్నారు.

తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతుందన్నారు. రాబోయే 100 రోజుల్లో బహుజనుల ఢాంక తెలంగాణ అంతటా మోగబోతోందని తెలిపారు.  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం కోసం టిఆర్పి ముఖ్య నాయకులతో చర్చ జరిగిందని, నాయకులందరూ వారి అభిప్రాయాలను తెలిపారని చెప్పారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్పి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి, మల్లన్న ఆదేశాల మేరకు నియామకాలు చేపడతామన్నారు. మేమెంతో మాకు అంత నినాదంతోనే టిఆర్పి పార్టీ ఏర్పడిందన్నారు. తీన్మార్ మల్లన్న ఆలోచన మేరకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు అనేక స్పందన గ్రామాలలో కనబడుతుందన్నారు. అతి త్వరలో గ్రామాలలో పల్లెల్లో పట్టణాలలో టిఆర్పి జెండా గద్దె నిర్మించి బహుజన రాజ్యాధికారి కోసం నాయకులమంతా ఏకమై ఒక సైనికుల్లాగా పని చేస్తామన్నారు.