12-06-2025 01:18:19 AM
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
భీమదేవరపల్లి జూన్ 11 ( విజయక్రాంతి ) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. బుధవారం మండలంలోని ముల్కనూర్ లో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఐదేళ్లు లోపు ఉన్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని విద్యార్థులకు చదువుతోపాటు పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు.
చిన్నారులు ఇష్టపడే పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం ముందుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి టీచర్లకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తూ విద్యార్థులను చదువు పట్ల ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారుల బరువు ఆధారంగా వారికి కావలసిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యాల పట్ల వైద్య సిబ్బందితో పర్యవేక్షణ ఉంటుందని ఆమె అన్నారు. అనంతరం అంగన్వాడి చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకలతో పాటు స్కూల్ యూనిఫామ్ లను ఆమె చేతుల మీదుగా అందజేసి పాఠశాల ఆవరణలో ఆమె చేతుల మీదుగా మొక్కను నాటి నీళ్లు పోయడం జరిగింది.
అనంతరం వంగర గ్రామంలో నిర్మిస్తున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మృతి వనాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆలస్యంగా జరుగుతున్న పనుల పట్ల ఆమె సంబంధిత జిల్లా ఉద్యానవన డి ఈ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఇన్చార్జి సిడిపిఓ శిరీష, ఎంఈఓ సునీత, పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్, అంగన్వాడి సూపర్వైజర్లు అనిత, పద్మ, టీచర్లు శోభారాణి, రాధిక, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.