calender_icon.png 8 June, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ ఏర్పాటుతో ‘ఉపాధి’ పనులకు మంగళం

09-04-2025 02:14:18 AM

విలీన గ్రామాల్లో ప్రత్యామ్నాయ ‘ఉపాధి’ కోసం కూలీల ఎదురుచూపులు

ఇతర గ్రామాల్లో జోరుగా ఉపాధి పనులు

మహబూబాబాద్, ఏప్రిల్ 8 ,(విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటుతో విలీన గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు మంగళం పాడారు.

ఫలితంగా కేసముద్రం మున్సిపాలిటీలో విలీనమైన కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, అమీనాపురం, సబ్ స్టేషన్ కాలనీ తండా గ్రామాల్లో ఈ ఏడాది వేసవిలో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు లభించక ప్రత్యామ్నాయ ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు.

ప్రతి ఏటా వేసవిలో వందల కుటుంబాలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. గత ఏడా ది ఐదు గ్రామాలతో కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విలీన గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టకూడదని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ కావడంతో పనులకు బ్రేక్ పడింది.

ఇతర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండగా కేసముద్రం బల్దియా పరిధిలోకి వచ్చిన విలీన గ్రామాల వ్యవసాయ కూలీల కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఇప్పుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కేసముద్రం మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామా ల్లో 4,935 కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు జారీ చేయగా, 2,776 కుటుంబాలకు చెందిన 9,773 మంది గత ఏడాది వరకు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనుల ద్వారా ఉపాధి పొందారు.

ఇందులో ఎస్సీలకు చెందిన 1,821, ఎస్టీలకు చెందిన 2,985, ఇతర వర్గాలకు చెందిన 4,967 మంది ఉపాధి పనులు నిర్వహించారు. అయితే ప్రస్తుత వేసవి సీజన్లో ఇతర గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా నిర్వహిస్తుండగా, కేసముద్రం పట్టణంలో విలీనమైన గ్రామాలకు చెందిన వందలాదిమంది ఉపాధి పనులు నిలిపివేయడంతో అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

పట్టణ పేదరిక నిర్మూలన పథకం అమలు చేయాలి 

కేసముద్రం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో జాబ్ కార్డులు ఉన్న కుటుంబాలకు పట్టణ పేదరిక నిర్మూలన పథకం అమలు చేయాలని కోరుతున్నారు. ప్రతి కుటుంబానికి ఏటా ఉపాధి పనుల ద్వారా లభించే లబ్ధికి అనుగుణంగా ఉపాధి కల్పించే అవకాశాలను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. పూర్తిగా వ్యవసాయ కూలిపైన ఆధారపడ్డ అనేక కుటుంబాలకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.