06-11-2025 07:32:56 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అనుమతుల ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి దామెరలో ఏర్పాటు చేస్తున్న పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు మిగిలిన అనుమతుల ప్రక్రియ, నిర్వహణ, తదితర అంశాలపై డిఆర్డిఓ, సహకార, పశుసంవర్ధక శాఖల అధికారులతో పాటు మహిళా డెయిరీ నిర్వాహకులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీకి పూర్తిస్థాయి బైలాస్ ను అధికారులు త్వరగా రూపొందించాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా డెయిరీకి గ్రామాల నుండి పాల సేకరణ మొదలుకొని బ్రాంచ్ మిల్క్ సెంటర్లకు, అక్కడినుండి డెయిరీకి తరలింపు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే సంఘాలలోని సభ్యులకు ములుకనూరు డెయిరీలో శిక్షణ కార్యక్రమాలను ఇప్పించినట్లు తెలిపారు. త్వరలోనే నడికూడ, పరకాల మండలాలలో బ్రాంచ్ మిల్క్ సెంటర్ లను ప్రారంభించి వాటి ద్వారా మహిళా డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో మండలంలో బీఎంసీలను ప్రారంభిస్తూ మహిళా డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో సాగుతున్నట్లు పేర్కొన్నారు. సబ్సిడీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు పాడి రైతులకు గేదెలను ఇప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రస్తుతం సభ్యత్వం ఉన్న 21 మంది ఆధార్ కార్డులు అందజేయాలని, ఫీజుబిలిటీ రిపోర్ట్ త్వరగా అందజేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఇతర అధికారులతో పాటు మహిళా డెయిరీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.