calender_icon.png 17 June, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకం

17-06-2025 01:15:30 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్ పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సీఎస్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఎన్‌ఎంసీ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.

ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కమిటీ వేయడం హాస్యాస్పదమన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.