దయ్యం పోలే.. ప్రాణం పోయింది
న్యూఢిల్లీ, ఆగస్టు 25: విజ్ఞానం ఎంత పెరిగినా ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలు మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ వ్యక్తికి దయ్యం వదిలిస్తామని చెప్పి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. కూలీ పని చేసుకొని జీవనం సాగించే సామ్యూల్ మాసీ (30) అనే వ్యక్తి కొంతకాలంగా మూర్చ రోగంతో బాధపడుతున్నారు. దీంతో అతడికి దయ్యం పట్టిందని నమ్మిన అతడి కుటుంబం స్థానిక చర్చిలో పనిచేసే జాకోబ్ మాసీ అనే పాస్టర్ను సంప్రదించింది.
ఆయన గత బుధవారం సామ్యూల్ ఇంటికి వచ్చి దయ్యాన్ని వదిలించే నెపంతో తీవ్రంగా కొట్టారు. పాస్టర్తో ఉన్న మరో 8 మంది కూడా కొట్టడంతో సామ్యూల్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో బాధిత కుటుంబం సామ్యూల్ మృతదేహాన్ని బుగురువారం ఖననం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పాస్టర్ అతడి అనుచరులను శనివారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు.






