పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యం
జిల్లా అదన కలెక్టర్ విక్టర్
కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి): పక్క ఓటర్ల జాబితా లక్ష్యంగాఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యంగా ఉండాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేక ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు.
ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని అన్నారు, అధికారులు, రాజకీయ నాయకులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని అన్నారు , జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపడతారని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు.
బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం
కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






