12-10-2025 05:42:53 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, భాగ్యనగర్, చీకటిగూడెం, కొత్తపేట, కాసానగోడు, గుడివాడ, ఇప్పలగూడెం, కొర్లపహాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు మార్కెట్ కు తెచ్చిన ప్రతి ధాన్యపు గింజను త్వరగా కోనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేనని ఆయన తెలిపారు.
రైతులు దళారుల చేతుల పడి మోసపోవద్దని ఆయన సూచించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవ్ రెడ్డి, అధికారులు, కంపసాటి శ్రీనివాస్ బొజ్జ సుందర్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.