15-06-2025 12:30:32 AM
ముగిసిన 16వ మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్
ముషీరాబాద్, జూన్ 14 (విజయ క్రాంతి) : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లేక్లో ఆరు రోజుల పాటు జరిగిన 16వ మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్ శనివారం ముగిసింది. ఉత్కంఠగా సాగిన పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అండర్-15 బాలుర విభాగంలో రిజ్వాన్ మహమ్మద్ స్వర్ణం గెలుచు కోవడమే కాకుండా ’బాయ్స్ ట్రోఫీ’ని కూడా కైవసం చేసుకున్నాడు.
అండర్-19 మికస్డ్ డబుల్స్ విభాగంలో తనుజ కామేశ్వర్- శ్రావణ్ కత్రావత్ జోడీ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. అండర్-15 బాలికల విభాగంలో లాహిరి కొమరవెల్లి హోరాహోరీ పోరులో రజత పతకం సాధించి అత్యంత నిలకడైన ప్రదర్శనకు ఇచ్చే ప్రతిష్టాత్మక ’ఎస్.హెచ్.బాబు మెమోరియల్ ట్రోఫీ’ని గెలుచుకుంది. తమిళనాడుకు చెందిన శ్రేయ కృష్ణ స్వర్ణం సాధించింది.
చివరి రోజు పోటీలు ప్రారంభమయ్యే ముందు శ్రేయ ఒక పాయింట్ ఆధిక్యంలో ఉండగా, 9వ రేసులో ఆమె వెనుకబడింది. ఇదే రేసును లాహిరి గెలిచింది. కానీ, చివరిదైన పదో రేసులో శ్రేయ ప్రథమ స్థానంలో నిలిచి, ఓపెన్, బాలికల విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అండర్-19 మికస్డ్ డబుల్స్ విభాగంలో దీక్షిత, గణేష్ రజత పతకం సాధించగా అండర్-15 బాలికల విభాగంలో చంద్రలేఖ తాతారి, బాలుర కేటగిరీలో వినోద్ దండు కాంస్యాలు గెలుచుకున్నారు.
అండర్-15 బాలికల విభాగంలో తమిళనాడుకు చెందిన శ్రేయ కృష్ణ స్వర్ణం అందుకుంది. అండర్-18 లేజర్ బాలికల విభాగంలో అలియా సబ్రీన్(తమిళనాడు) బంగారు పతకం సాధించింది. అండర్-19 స్కిఫ్ క్లాస్లో కార్తీక్ కొర్రోల-హృదయ్ జోషి(గోవా) స్వర్ణం నెగ్గగా కృష్ణ-తంగై(మైసూర్) రజతం, అజయ్ గజ్జి, సత్యం ఝా(గోవా) కాంస్యం సాధించారు.