calender_icon.png 18 June, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ నాయకుడు మళ్లీ రావాలి

30-08-2024 12:53:53 AM

“ఆగమాగం కాకండి. మీ పిల్లల భవిష్యత్తుకు నాది భరోసా. ఒక్కడిని బక్క పలుచని నన్ను కొట్టడానికి అందరు బలవంతులు కలిసొస్తున్నారు. మీ కోసం, తెలంగాణ కోసం కాపలాకుక్కలా వుంటా. ఆలోచించి ఓటేయాలి” అని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేళ కేసీఆర్ అన్నమాటలివి. అప్పుడు ప్రజలు 88 సీట్లతో ఘనవిజయాన్ని అందించి, రెండవసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆయన జీవిత ప్రస్థానం గమనిస్తే అనూహ్య పరిణామాలు, అపజయాలు, విజయాలు, భావితరాలకు స్ఫూర్తి నింపే పోరాట ఉద్యమాలు అన్నీ అడుగడుగునా కనిపిస్తాయి. చరితను సైతం కదిలిస్తాయి.

“నేను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అంటూ గాంధీజీ అహింసా మార్గంలో ఆయన నడిపిన తెలంగాణ సాకారపు పోరు ఎప్పటికీ ఆదర్శమే. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణకు మద్దతిచ్చింది ఎవరైనా కావచ్చు కానీ, తెలంగాణ తెచ్చింది ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గదర్శకత్వంలో కేసీఆర్ తిరుగులేని, ఎదురులేని అసమాన ధైర్య సాహసాలే. కేవలం రెండు ఎంపీ సీట్లతో 1969 నుంచి కొన్ని దశాబ్దాలు నడిచిన, కోట్లమంది ప్రజలకు సంబంధించిన ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే రాష్ట్ర సాకారం అంటే అసాధారణ విజయమే. నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదాలతో దద్దరిల్లిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ దాదాపు దశాబ్దం కాలంపాటు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపారు.

నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోకపోవడం, కేవలం పార్టీ కేడర్‌కు మాత్రమే సంక్షేమం అందేలా చూడటం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించక పోవడం, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం, జనం మధ్యలో లేకుండా నియంతృత్వ పోకడలతో పాలన అందించారనే ఆరోపణలు, విమర్శలతో 2023 అసెంబ్లీ ఫలితాల్లో 39 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. దెబ్బమీద దెబ్బ పడ్డట్టు 18వ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటుకూడా గెలువక పోవటం నేడు పార్టీ మనుగడపై, కేసీఆర్ నాయకత్వంపై విస్తృత చర్చలు దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 

ఐక్యరాజ్యసమితి నుంచి అభినందనలు అందుకున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛను వంటి ప్రభుత్వ పథకాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థుల సైతం ఐఐటీ, నీట్‌లలో సీట్లు సాధించి ఇంజినీర్లు, డాక్టర్లు కావటం వంటి సంఘటనలు చారిత్రాత్మకమైనవే. కానీ, కొన్ని సందర్భాల్లో కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పనిచేయక పోవడం, ఫిరాయింపులను ప్రోత్సహించటం, జనం మధ్యలో లేకుండా దశాబ్దం పాటు పాలన అందించడం, ఉద్యోగాలను సకాలంలో భర్తీ చేయక పోగా, పరీక్ష పేపర్లు ముందే లీక్ కావడం వంటి తప్పిదాలు నేడు బీఆర్‌ఎస్ పరిస్థితికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, బీజేపీ నాయకులు అంటున్నట్లు ‘కేసీఆర్ పనై పోయింది, బీఆర్‌ఎస్ ఇక కోలుకోదు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తాం’ వంటి విమర్శలు బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు కొత్తేం కాదు. తన పార్టీనుంచి మంచి పదవులు పొందిన నాయకులు వెళ్ళిపోవడం, కేసీఆర్‌ను నియంత అనడం కూడా గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్నదే. పట్టుమని పదిమంది లేరని అసెంబ్లీలో అవమానాలను పొందిన పార్టీ పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిందంటే దానికి ఒకే ఒక కారణం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో ఉన్న ఆత్మీయ అనుబంధం. ఆయన నాయకత్వంపై, దార్శనికతపై తెలంగాణ ప్రజలకు వున్న విశ్వసనీయత. ఏదేమైనా తెలంగాణలో కేసీఆర్ స్థాయికి సరితూగే నాయకులు లేరన్నది ఇప్పటికీ ఆయన విధానాలు నచ్చని కొందరు రాజకీయ నాయకులు కూడా ఒప్పుకునే అంశం.

మౌనం వీడాలి

కాలక్రమంలో వస్తున్న మార్పులు, ప్రజల ఆలోచనల్లోని తేడాలు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూకుడు నాయకత్వం వంటి పోకడలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ బలమైన ప్రతిపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ప్రజలమధ్యలో ఉంటూ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువుగా వారి సమస్యల పరిష్కారానికై ఉద్యమ కేసీఆర్‌ను మళ్ళీ ప్రజలు చూడాలనుకుంటున్నారు.

భవిష్యత్ రాజకీయాల్లో మళ్ళీ బీఆర్‌ఎస్ దేశంలో చక్రం తిప్పాలని, కేటీఆర్, హరీష్‌రావుల ప్రాధాన్యం పెంచుతూ కేసీఆర్ మళ్ళీ విజయతీరాలకు చేరాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. పిడికెడు మందితో పార్టీని స్థాపించి ఎన్నో ఒడుదొడుకులతో రాష్ట్రాన్ని సాధించి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతు పొందిన కేసీఆర్ తనను నమ్ముకున్న రాష్ట్ర ప్రజల కోసం ఇంకా చాలా చేయాల్సింది ఉందని గమనించి, ఆ మేరకు కారు స్టీరింగ్ చేపట్టాలి.

మన తెలంగాణ జయశంకర్ సార్ కలలు గన్నట్ల దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఓ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లుగా అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తే, కేసీఆర్ జాగ్రఫీ క్రియేట్ చేశారు. అనుకున్న పని జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉందని తెలిసి, అందరూ వెనక్కి లాగుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఓ సాహసికుడు.

ఆయన అన్నట్లు ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ తనకు ఎంతో ఆదర్శవంతమైన గాంధీజీ మార్గంలోనే తెలంగాణ ప్రజల పక్షాన తన గుండె శబ్దాన్ని, జై తెలంగాణగా తన వాణిని వినిపించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక బాధ్యత పోషించాలి.ప్రస్తుత ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగట్టి ప్రజాపక్షమై తన బలమైన వాగ్ధాటితో కేసీఆర్ అడుగులు కదపాలి. ‘ఓ మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను కేసీఆర్ ఓసారి ఆలోచించి ఆచరించాలి.

- ఫిజిక్స్ అరుణ్ కుమార్