30-08-2024 12:52:29 AM
-కె. వేణుగోపాల్ :
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) సమస్యలకు నెలవుగా మారాయని ఎన్సీఈఆర్టీ అ ధ్యయనంలో తేలింది. నిధుల వినియోగం లో పారదర్శకత లోపించడం, మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత, అరకొర జీతాలు, విద్యార్థినుల భద్రతపై ఆందోళన వంటి సమస్యలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2007లో మొదటిసారి, 2013లో రెండోసారి ఎన్సీఈఆర్టీ ఈ పరిశీలన జరపగా, ఇది మూడోసారి. కేంద్ర ప్రభుత్వం 2004లో బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేసింది. జాతీయ సగటు కంటే గ్రామీణ మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ తరగతుల బాలికలు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తారు.
గతేడాది జూన్ 30 నాటికి దేశంలోని 5,035 కేజీబీవీల్లో 6-12 తరగతుల్లో 6,88,013 మంది బాలికలు చదువుకుంటున్నారు. తెలంగాణలో 475 కేజీబీవీలు ఉండగా, 225 కేజీబీవీలలో ఇంటర్ వరకు తరగతులు పొడిగించారు. ఈ విద్యా సంవత్సరం సుమారు మరో 50 వరకు స్కూళ్లలో పొడిగించే అవకాశం ఉంది. బాలికల ఉన్నత మాధ్యమిక విద్యకోసం ఏర్పాటైన కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ (ప్రిన్సిపాల్) నుండి అటెండర్ వరకు బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం మహిళలనే నియమించడం విశేషం. మన రాష్ట్రంలో ప్రిన్సిపాల్ సహా సిబ్బంది అంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే, గత 20 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న కేజీబీవీల్లో ఆ విజయానికి కారకులైన సిబ్బందికి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయి.
ప్రచారం ఘనం.. ఆచరణ శూన్యం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బాలికా సాధికారికత, బాలికల విద్య అనివార్యతల గురించి విపరీత ప్రచారం చేస్తున్నది. కానీ, ఆచరణలో లక్ష్యసాధన పట్ల అత్యంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దేశవ్యాప్తంగా కేజీబీవీల సంఖ్య పెరుగుతున్నది కానీ నిధులను ఆ స్థాయిలో పెంచడం లేదు. కేజీబీవీ సిబ్బందికి కనీస వేతనాల విషయంలోగానీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలోగానీ మోదీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు సరికదా, నిర్వహణ బాధ్యతల నుండి నెమ్మదిగా వైదొలగి, రాష్ట్రాలపై నెట్టి వేసే ప్రయత్నాలు చేస్తున్నది.
కేజీబీవీల్లో ప్రధానంగా నిరుపేదలు, అనాథలు, బడి మానేసిన బాలికలు చేరుతారు. ఇలాంటి బాలికలను గ్రామాల్లో గడపగడపకు తిరిగి, వారిని బడుల్ల్లో చేర్చడంలో టీచర్ల కష్టాలు వర్ణనాతీతం. కేజీబీవీలో ప్రవేశం పొందే బాలికలు సహజంగానే చదువులో చాలా వెనుకబడి ఉంటారు. కొందరికి కనీసం చదవడం, రాయడమూ రాదు. ఈ కనీస స్థాయి అక్షర జ్ఞానం కూడా లేని, బాలికలను చేర్చుకొని ఇతర ప్రైవేటు, ప్రభుత్వ, గురుకులాల విద్యార్థినులతో పోటీగా ఫలితాలు సాధించే స్థాయికి తీసుకెళ్లడంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిణులు, లెక్చరర్లు, టీచర్ల పాత్ర వెలకట్టలేనిది.
ఇంత అంకితభావంతో పనిచేస్తున్న టీచర్లపట్ల ప్రభుత్వం అడుగడుగునా వివక్ష ప్రదర్శిస్తున్నది. చివరకు బోధనోపకరణాల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి భత్యం రాకపోవడం, టీచర్లే తమకొచ్చే అరకొర వేతనం లోంచే కొనుక్కోవాల్సి వస్తున్నది. చదువు చెప్పడమేకాక ప్రభుత్వం అప్పగించే ఇతర బోధనేతర పనులనూ వీరు నిర్వహిస్తున్నారు. అయినా, ప్రభుత్వం నుంచి గానీ, విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం, కనీస గుర్తింపు లభించడం లేదు.
24 గంటల డ్యూటీ
కేజీబీవీలో అత్యంత ఒత్తిడికి, మానసిక శారీరక ఇబ్బందులకు, వెట్టిచాకిరీకి గురయ్యేది ప్రత్యేక అధికారిణి (ఎస్ఓ)లే. 6 తరగతి నుండి 10 తరగతి వరకు అకాడమిక్ బాధ్యతలతోపాటు హాస్టల్ వార్డెన్ బాధ్యతలూ చూడాలి. ఇంటర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో మొత్తంగా నాలుగు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. అకౌంటెంట్ లేదా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టు ఖాళీగా ఉన్నచోట వీరి బాధలు వర్ణనాతీతం. మానసికంగా వీరు 24 గంటలు డ్యూటీలోనే ఉండాల్సి వస్తున్నది.
10వ తరగతి వరకున్న ప్రతి కేజీబీవీ పాఠశాలలో 200 మంది, ఇంటర్ వరకున్న పాఠశాలలో 360 వరకు విద్యార్థులకు గాను 13 మంది నాన్ టీచింగ్, ఇతర వర్కర్స్ ఉంటారు. వీరు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా పని చేస్తున్నారు. వేతనాలు మాత్రం రూ. 7,800 రూపాయల నుండి రూ.14,300 వరకే ఇస్తున్నారు. ఇతర గురుకులాలతో సమానంగా పనిచేస్తున్న వీరికి 2006లో వచ్చిన జీవో 14ను, 2021లో వచ్చిన జీవో 60నిగాని అమలు చేయడం లేదు.
పట్టించుకోని గత ప్రభుత్వం
వాస్తవానికి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కేజీబీవీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతనాలు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ మనకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. తెలంగాణలో ఈనాటికీ కేజీబీవీ సిబ్బందికి వేతనాల విషయంలో నిరాశే మిగిలింది. గత కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఉద్యమ, ఎన్నికల సమయాల్లో, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ, అమలు చేయలేదు. కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలలే అయినా 58 శాతం మంది ఉపాధ్యాయులు క్యాంపస్లో ఉండడం లేదు.
కేవలం 170 కేజీబీవీల్లో మాత్రమే వార్డెన్లు ఉన్నారు. మిగిలిన చోట్ల హాస్టళ్ల బాధ్యత ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, అసిస్టెంట్ వార్డెన్లు, కేర్ టేకర్లు, అకౌంటెంట్లపై పడుతున్నది. భర్త, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాస్టల్లో ఉండేందుకు వార్డెన్లను అనుమతించడం లేదు. దీంతో చాలామంది వార్డెన్లు వేరే దారి చూసుకుంటున్నారు. తమకు రక్షణ లేదని మూడోవంతు బాలికలు వాపోతున్నారు. విద్యార్థినుల్లో పలువురు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని నివేదిక తెలిపింది. ఉపాధ్యాయుల్లో 19 శాతం మంది మాత్రమే పుల్ టైమ్ రెగ్యులర్ టీచర్లు. 623 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో, 70 మంది డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన విద్య ఎలా లభిస్తుందని నివేదిక ప్రశ్నించింది.
కేజీబీవీల్లో రెగ్యులర్ ఫుల్టైమ్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కొరత ఎక్కువగా కన్పిస్తున్నది. తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఉండడం వల్ల సిబ్బంది లభ్యత కష్టమవున్నది. మొత్తం 5,035 కేజీబీవీల్లో 2,735లో పాఠశాల, హాస్టల్ ఉన్నాయి. 2,300 చోట్ల హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి. హాస్టల్ మాత్రమే ఉన్నచోట బాలికలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తున్నది. ఉపాధ్యాయుల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవమున్న వారు 44 శాతం మంది ఉన్నారు. ఇక అనేక హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కన్పించడం లేదు. కొన్ని కేజీబీవీ భవనాలకు సరిహద్దు గోడలైనా లేవు. ఒకవేళ ఉన్నా వాటి ఎత్తు తక్కువే.
కేజీబీవీ సిబ్బందిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజీబీవీ టీచర్లు ఆందోళన చేసినా వారికి న్యాయం జరగలేదు. కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని, వీలైనంత త్వరగా కనీస వేతనాలు అమలు చేస్తామని, రెగ్యులరైజేషన్ ప్రక్రియను పరిశీలిస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. కానీ, 8 నెలలు కావస్తున్నా ఆ హామీ అమలు కావడం లేదు.
వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్
సెల్: 9866514577