calender_icon.png 26 June, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహన చోదకుల మరణాలను తగ్గించడమే స్పెషల్ డ్రైవ్‌ల ముఖ్య ఉద్దేశం

26-06-2025 12:42:49 AM

-గత 4రోజులలో 1949మందికి జరిమానాలు 

-మాకోసం కాదు.. మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి

-జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి

ములుగు ప్రతినిధి, జూన్25 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన చోదకుల హెల్మెట్ ధారణపై ములుగు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లాలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా,కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

ఇటీవల కాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడం వలన అధిక మరణాలు సంభవించినట్లు తాము గమనించినట్లు తెలిపారు. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలలో ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులలో మార్పు తెచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెఓలను ఆదేశించామని తెలియజేశారు.

ఈ ఆదేశాలనుసారం2025జూన్19 నుండి ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఎస్హెఓ లు  స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ల ద్వారా 2025 జూన్21 నాడు  హెల్మెట్ ధరించని 297 మందికి రూ.42,100 జరిమానా విధించడం జరిగింది అని, 22.06.2025 నాడు హెల్మెట్ ధరించని 417 మందికి రూ.60,900జరిమానా విధించడం జరిగిందని,23.06.2025 నాడు హెల్మెట్ ధరించని 531 మందికి రూ.1,02,355జరిమానా విధించడం జరిగిందని,24.06.2025 నాడు హెల్మెట్ ధరించని 704 మందికి రూ.1,07,500జరిమానా విధించడం జరిగిందని,మొత్తంగా 4 రోజులలో 1949 మందికి రూ.3,12,855జరిమానా విధించడం జరిగిందని తెలియజేశారు.

కావునా ద్విచక్ర వాహన చోదకులు విధిగా,బాధ్యతగా హెల్మెట్ ధరించాలని,రోడ్డు భద్రత నియమాలను పాటించాలని రోడ్డు ప్రమాదాలలో విలువైన తమ ప్రాణాలు కోల్పోకూడదు అని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లు జరిమానాల కోసం కాకుండా వాహన చోదకులు మరియు ప్రజలలో మార్పు కోసమే నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. అదే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ లు మరి కొంతకాలం కొనసాగుతాయని తెలియజేశారు