5 March, 2026 | 3:20 AM

నా టీమ్ కోసం ఈ సినిమా సక్సెస్ కావాలి

05-03-2026 01:50 AM

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇందులో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లు. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బుధవారం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్ మాట్లాడుతూ.. “నేను హీరో అవుదామన్న ప్రతిసారి ‘నీ మార్కెట్ ఏంటి’ అనే ప్రశ్న వస్తుంది. నిజానికి అందరూ ఆదరిస్తేనే ఒక మార్కెట్ వస్తుంది. ఈ సినిమా కోసం 100% దృష్టి పెట్టాను. ఈ సినిమా.. నాకంటే నా టీమ్ కోసం గెలవాలి. ప్రేక్షకులకు వినోదం పంచడం కోసమే మా జీవితాలు అంకితం. నిజాయితీతోనే ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరోయిన్ గాయత్రి రమణ మాట్లాడుతూ.. “జ్యోతి అనే అమ్మాయి మల్లేశ్ జీవితంలో ఎంత కీ రోల్ ప్లే చేసిందనేదే నా క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు. ‘చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాను. బాల సతీశ్ నేను కథ విషయంలో చాలా కసరత్తు చేశాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామ’ని నిర్మాత రాజేశ్ తెలిపారు. చిత్ర సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు చాలా పర్సనల్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.