19 May, 2026 | 3:59 AM

వీడీ సతీశన్.. అనే నేను

19-05-2026 01:37 AM

కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం

మరో ౨౦ మంది మంత్రులూ ప్రమాణం

గవర్నర్ ఆర్లేకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు 

త్రివేండ్రం, మే 18: కేరళం నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సోమవారం ఉదయం వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆధ్వర్యంలో త్రివేండ్రంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరో ౨౦ మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళం మాజీ సీఎం పినరయి విజయన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తదితరులు హాజరయ్యారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎంతోపాటు మంత్రులంతా లోక్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా సెక్రటేరియట్‌కు చేరుకుని మొదటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. 

మంత్రులు వీరే..

కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రివర్గంలో రమేష్ చెన్నితల, సన్నీ జోసెఫ్, కె.మురళీధరన్, ఏపీ అనిల్‌కుమార్, పీసీ విష్ణునాథ్, టీ సిద్దిఖీ, బిందుకృష్ణ , కేఏ తులసి, రోజీ ఎం.జాన్, ఎం.లిజు, ఓజే జనీష్‌కు చోటు దక్కింది. మిత్రపక్షాల్లో ఇండియన్ నియన్ ముస్లిం లీగ్ (ఐఎంఎల్) నుంచి పీకే కుహాలికుట్టి, ఎన్.షంసుద్దీన్, కేఎం షాజీ, పీకే బషీర్, వీఈ అబ్దుల్ గఫూర్, ‘కేరళ కాంగ్రెస్ - జోసెఫ్’ నుంచి మోన్స్ జోసెఫ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ షిబు బేబీ జాన్, ‘కేరళ కాంగ్రెస్ - నుంచి అనూప్ జాకబ్, సీపీఐ నుంచి సీపీ జాన్‌కు చోటు దక్కింది.

వీరిలో షిబు బేబీ జాన్, సీపీ జాన్ భగవంతుడి పేరిట కాకుండా, దృఢ నిశ్చయంతో ప్రమాణం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే, ఆంగ్లంలో ఒక్క కె.మురళీధరన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారంతా మారి మాతృభాష మల యాళంలో ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో మొత్తంగా ఇద్దరు మహిళలకు, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు చెందిన ఇద్దరు నేతలకు చోటు లభించింది. రమేష్ చెన్నితలకు విజిలెన్స్, హోంశాఖలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూశాఖ కేటాయించాలని యూడీఎఫ్ నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం సతీశన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆశావర్కర్ల గౌరవ వేతనం రూ.వెయ్యి చొప్పున పెంచుతామని వెల్లడించారు. 2023లో యువజన కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.