28-12-2025 01:47:11 AM
పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్, మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్
మహబూబాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రానికి తర్వాతి సీఎం మళ్లీ కేసీఆరే అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచా యతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ అని, మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్, ఆ తర్వాత అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని వాఖ్యానించారు.
ఏ ఎన్నికలొచ్చినా గెలిచేది బీఆర్ ఎస్సేనని జోస్యం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షురా లు మాలోత్ కవిత ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని, రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ అని విమర్శించారు.
14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి, రాష్ట్రాన్ని సాధించి, 9 ఏళ్ల పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో 11సార్లు రూ.73 వేల కోట్లు 75 లక్షల మందికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో రైతుబంధు కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేలు, వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అత్తకు రూ.4వేలు, కోడలికి రూ.2500, ముసలమ్మకు, ముసలయ్యకు పింఛన్ ఇస్తామని సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీపై రేవంత్రెడ్డి ఒట్లు వేసి, ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. కల్లబొల్లి హామీలతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి, అత్తెసరు మార్కులతో అధికారం చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. ‘నూరు రోజులన్నారు.. రెండేళ్లు దాటింది హామీలు ఏమయ్యాయి.. కాంగ్రెస్ నేతలు ఏం పీకుతున్నారు’ అంటూ ఘాటుగా విమర్శించారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయా ణం అంటూ, పురుషులకు డబుల్ చార్జీలు, బస్సు పాస్ చార్జీలను పెంచి ఇంకో రకంగా భారం వేసి ఫ్రీ బస్ అంటున్నాడని విమర్శించారు. హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే, కేసీఆర్ను, తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఒకసారి ఫోన్ ట్యాపింగ్, మరోసారి ఈ కార్ రేస్, ఇంకోసారి కాలేశ్వరం ప్రాజెక్ట్ అంటూ తమను విమర్శిస్తూ బంగారం లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా సీఎం రేవంత్రెడ్డి పాలన సాగుతోందని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, డబ్బులన్నీ ఢిల్లీకి సంచుల్లో మోయడం తప్ప పరిపాలన చేతకాదని తేలిపోయిందన్నారు. మంచిగా ఉన్న రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక పూర్తిగా ఆగం చేశాడని విమర్శించారు.
గ్రామాల నిధులను ఆపడం ఎవరి తరం కాదు
గ్రామాలకు వచ్చే నిధులను ఆపడం ఎవరి తరం కాదని, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి చేతిలో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. నేరుగా పంచాయతీకి నిధులు ఇచ్చే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచులను కేటీఆర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యా నాయక్, భానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
రెండేళ్లలోనే కాంగ్రెస్పై ప్రజల్లో మార్పు
ఒక్క సీటు పోతే ఏం కాదులే అనుకొని మానుకోట, డోర్నకల్, పాలకుర్తి ఓటర్లు అనుకున్నారని, ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా అనేక చోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం వల్ల బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్పై రెండేళ్లలో ప్రజల్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, పంచాయతీ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు.
45 శాతానికి పైగా రాష్ట్రంలో సర్పంచ్ పదవుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని, ఇంకా కొన్ని చోట్ల తక్కువ ఓట్లతో గెలిచినప్పటికీ, అధికారం అడ్డం పెట్టుకొని వెయ్యికి పైగా సర్పంచులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసు కుందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ అని, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు సెమీ ఫైనల్ అని, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో చేసిన విధంగా ఒక్క సీటు పోతే ఏమవుతుందని భావించవద్దని, వచ్చే ప్రతి ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే వారి కారు గుర్తుకు ఓటు వేయడమే లక్ష్యం కావాలని, మళ్లీ ము ఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టడం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మారుమూల మహబూబాబాద్ ప్రాంతా న్ని అభివృద్ధి చేయడానికి జిల్లా గా ప్రకటించడంతోపాటు, మెడికల్ కాలేజీ, అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశాడని గుర్తు చేశారు. 1970లోనే ముఖ్యమంత్రి కాగల స్థాయి ఉన్న దివంగత నూకల రామచంద్ర రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ నిర్ణయించాడని, ఆ మేరకు ఏర్పాటుచేసిన రామచంద్ర రెడ్డి విగ్రహాన్ని ఈనాడు ఢిల్లీకి మూ టలు మోసే వారు ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు.
సీఎం అల్లుడుది ఆంధ్రా కాదా?
తాను గుంటూరులో చదువుకున్నానని విమర్శిస్తున్న రేవంత్రెడ్డి.. ఆయన అల్లుడు ఆంధ్రావాడు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం భీమవరం బుల్లోడుగా మారాడంటూ విమర్శించారు. తాము వ్యక్తిగత విమర్శలకు పోవడం లేదన్నారు. తనకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడుతు న్నారని చెప్పారు.
71 ఏళ్ల వయసుగల వ్యక్తిని, రెండుసార్లు ముఖ్య మంత్రి పదవిని నిర్వహించిన కేసీఆర్ను తీవ్ర పదజాలంతో విమర్శిం చడం తగదన్నారు. రేవంత్కు తల్లిదండ్రులు సంస్కారం నేర్పారో లేదో తెలి యడం లేదన్నారు. ‘రేవంత్రెడ్డి నీకు ఒకటే భాష వచ్చు. నాకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మూడు భాషలు వ చ్చు. అవసరమైతే మానుకోట ప్రాం త గిరిజన ప్రజల గోర్ భాష కూడా నేర్చుకొని తిట్టగలను’ అని అన్నారు.
నూరు రోజులన్నారు.. రెండేళ్లు దాటింది. హామీలు ఏమయ్యాయి.. కాంగ్రెస్ నేతలు ఏం పీకుతున్నారు.
అధోగతి పాలుచేసే విధంగా సీఎం రేవంత్రెడ్డి పాలన సాగుతోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. డబ్బులన్నీ ఢిల్లీకి సంచుల్లో మోయడం తప్ప పరిపాలన చేతకాదని తేలిపోయింది. మంచిగా ఉన్న రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక పూర్తి గా ఆగంచేశాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్