17-05-2025 04:53:04 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ సమస్యల వలయంలో చిక్కుకుందని, సమస్యలను పరిష్కరించాలంటూ మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar), మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్మన్ రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణ రావులు శనివారం కరీంనగర్ కలెక్టర్ కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. కాంతులీలిన కరీంనగర్ ఇప్పుడు కళావిహీనంగా మారిందన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో చేపట్టబడిన అంబేద్కర్ భవన్, శాదిఖన, అమృత వర్షిణి కన్వెన్షన్ హాలును వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
సస్పెన్షన్ బ్రిడ్జ్ పై డైనమిక్ లైటింగ్ సిస్టమును వెంటనే ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలి. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలన్నారు.ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డు వెంటనే ఇవ్వాలన్నారు. నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల లేమితో గ్రామాలన్నీ చీకటిమయం అవుతున్నాయని సరైన సమయంలో నిధులు చెల్లించక పంచాయతీ కార్యదర్శులు సతమతం అవునున్నారని వివరించారు.