‘హయత్నగర్ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినుల ప్రతిభ
ఎల్బీనగర్, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ హయత్నగర్ బాలికల కళాశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మంచి మార్కులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకువచ్చారు. ఫస్టీయర్ ఎంపీసీ విభాగంలో దీక్షిత 464 మార్కులు సాధించారు. బైపీసీలో నౌషీన్ పర్వీన్ 435, కీర్తన 433 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు.
రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థి సిరివర్శిని 1000 మార్కులకు 984 మార్కులు సాధించగా, దీవెన కుమారి 1000కి 979 సాధించింది. సెకండియర్ బైపీసీ విభాగంలో లాస్య 1000 మార్కులకు 988, శుభశ్రీ 1000 మార్కులకు 988 సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థినులు 98 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. కాలేజీ ప్రిన్సిపాల్ దేవిరెడ్డి జ్యోతి, కళాశాల కో ఆర్డినేటర్ జి.రమాదేవి మాట్లాడుతూ.. విద్యార్థినుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.




