24-04-2025 01:09:05 AM
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పహల్గామ్లోని బైసరన్లో నిరాయు ధులైన పర్యాటకులను లక్ష్యంగా జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర దాడులు జరగడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అయన ఆరోపించారు.
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శ నలు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ఆప్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆప్ తెలంగాణ కమిటీ హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్బంగా ఆప్ శ్రేణులు కొవ్వత్తులు వెలిగించి పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు అర్పించి ఉగ్రవాదం నశించాలి, శాంతిని కాపాడాలని పెద్దఎత్తున నినాదాలు చేసారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్లో ‘పూర్తి సాధారణ స్థితి‘ గురించి బిజెపి పదేపదే వాదించడం బూటకమని నిన్నటి ఉగ్రవాదుల దాడులతో తేటతెల్లమైందని అన్నారు. మోదీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ దేశంలో ప్రజాస్వామ్య స్వరాలను అణచివేయడం తప్ప, శాంతి భద్రతలను అందించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నా యని, పౌరులు, నివాసితులు, వలస కార్మికులు ఇప్పుడు పర్యాటకులపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, ఇది కేంద్ర నిఘా వర్గాల వైఫల్యమేనని, భారతదేశ జాతీయ భద్రత ’అత్యున్నతమైనది కాబట్టి దిద్దుబాటు చర్యలు వెంటనే చేపట్టాలని అయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీ తన రాజకీయ లాభం కోసం ఈ విషాద సంఘటనను సాకుగా ఉపయోగించుకునే ఏమైనా చేస్తే తిప్పికొడతామని అయన హెచ్చరించారు. పహల్గామ్ బాధితులకు ఆప్ ప్రగాఢ సానుభూతిని కుటుం బాలకు సంఘీభావం తెలియజేస్తున్నామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు జావీద్ షరీఫ్, సుధా రాణి, డా. లక్ష్య నాయుడు, కొడంగల్ శ్రీనివాస్, మౌనిక, షాబాజ్ తదితరులు పాల్గొన్నారు.