కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు
- భార్యను చంపి పరారైన భర్త
- సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఘటన
పటాన్చెరు, ఏప్రిల్ 4(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో భర్త భార్యను చంపి పరారయ్యాడు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అంబటి పరమేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో కొడుకు, కోడలు లేని సమయంలో తన భార్య అంబటి లీలావతి(60)ని కత్తితో గొంతు కోసి చంపి పరారయ్యాడు.
అయితే నిందితుడు గత కొంతకాలంగా మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలా లేక మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




