calender_icon.png 9 June, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరమీసాల స్వామి కల్యాణం

10-01-2025 12:00:00 AM

ఉత్తర తెలంగాణా జిల్లాలలో భక్తులకు కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన వీరభద్రస్వామి ఆలయం జాతరకి సిద్ధమైంది. ‘కోర మీసాల స్వామి’గా చరిత్రకెక్కిన ఈ దేవాలయం విశిష్టత సామాన్యమైందేమీ కాదు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆల యం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఉంది. క్రీ.శ.1600లో వంటచెరుకు కోసం కొం దరు కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు.

పనయ్యాక అలసటతో వారు అక్కడే నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూస్తే ఎడ్లు కనబడలేదు. దాంతో ఆ రాత్రి కూడా అక్కడే నిద్రించారు. అప్పుడు వారికి కలలో వీరభద్రుడు కనిపించాడట. తనను గుట్టమీంచి కిందికి దించి, గుడి కట్టి ప్రతిష్ఠించాలని అప్పుడు వారి ఎడ్లు దొరుకుతాయని స్వామి చెప్పాడు. అలా గుట్టకింద వీరభద్రస్వామిని ప్రతిష్ఠించారని, ఈ క్రమంలో స్వామి విగ్రహం కాలు విరిగినట్లు స్థానికులు చెబుతారు. 

పది రోజులపాటు కళ్యాణోత్సవాలు

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళమధ్య నిర్మితమైంది. శిలామ యమైన ఈ ప్రదేశంలో అయిదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం విశేషం. దీనిని వీరభద్రస్వామి మహత్తుగా ప్రజలు చెప్తారు. ప్రతీ ఏడాది జనవరిలో సంక్రాంతి ముందు రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ప్రధాన ఆకర్షణగా సంక్రాంతినాడు ప్రజలు ఎద్దులబండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. పుష్య బహుళ పంచమి నాడు మొదలై 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. 

నేటినుంచి జాతర ప్రారంభమై రేపు త్రిశూల పూజ, 12న వాస్తుపూజ, 13న లక్ష బిల్వార్చన, 14న భోగి పండుగ, 15న బండ్లు తిరుగుట (జాతర), 16న నాగవెల్లి, వసంతోత్సవం, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన ఉంటాయి. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీ సాలు సమర్పిస్తారు.

వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు, బీరభద్రపల్లెరం చేస్తారు. ఈ స్వామివారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. జాతర జరిగిన అన్ని రోజులూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు సిద్దిపేట, హుస్నాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, హుజురాబాద్, జమ్మికుంట, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా సందర్శిస్తారు.

వివిధ గ్రామాల నుంచి ఎడ్లబండ్ల మీద కూడా జాతరకు వస్తూంటారు. ఆర్టీసీ వివిధ డిపోలనుంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. భక్తులకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు అన్ని వసతులు కల్పిస్తారు. వైద్యం, మంచినీటి సౌకర్యం, రవాణా తదితర ఏర్పాట్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసు శాఖ కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంది. స్థానిక శాసనసభ్యులు సతీష్‌కుమార్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కామిడి సతీష్‌రెడ్డి