04-06-2025 12:31:44 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, ( మునుగోడు) జూన్ 3: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి యువ రైతులకు పంట సాగు మెలకులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేది వ్యవసాయమని, ఆధునిక పద్ధతుల అవలంబిస్తూ రైతులు ఎక్కువ రాబడిని పొందాలని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రధాన వనరు నీరు అని, మునుగోడు నియోజకవర్గం లో ప్రతి మండలానికి సాగునీరు అందించే బాధ్యత నాదేనని ఆయన అన్నారు.
శివన్న గూడెం రిజర్వాయర్ కు నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానని, మరోవైపు చిన్న నీటిపారుదల ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా మొదటి దశగా 148 చెరువులను అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.
అనంతరం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడిని సాధిస్తున్న యువ రైతులను ఎమ్మెల్యే గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, మునుగోడు నియోజకవర్గం ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.