04-06-2025 12:30:09 AM
వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఏ .జానయ్య
నల్లగొండ టౌన్, జూన్3 : రానున్న రెండు, మూడేళ్ళలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఏ .జానయ్య తెలిపారు.
ఇందుకుగాను 430 మంది వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలను రూపొందించి వాటిని రాష్ట్రంలోని 11 వేల రెవెన్యూ గ్రామాలలోని 40 వేల మంది రైతులకు ఫౌండేషన్ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘నాణ్యమైన విత్తనం- రైతు నేస్తం‘ పేరున వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఫౌండేషన్ సీడ్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా 300 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
మంగళవారం నుండి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల ద్వారా రెవెన్యూ గ్రామానికి ముగ్గురు లేదా నలుగురు రైతుల చొప్పున ఈ ఫౌండేషన్ సీడ్ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల రైతులు మోసపోకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విత్తనాలను రూపొందించి వాటిని రైతులకు పంపిణీ చేయడం ద్వారా తిరిగి రైతులు అదే విత్తనాలను ఉపయోగించి నాణ్యమైన పంటలు పండించుకునేందుకు చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్కు నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తిప్పర్తి మండల వ్యవసాయ అధికారి సన్నీ రాజ్ తదితరులు హాజరయ్యారు.