పారితోషికంలో హీరో, హీరోయిన్లకు జమీన్ ఆస్మాన్ ఫరఖ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారీ ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకుంటూ తన జోరు చూపిస్తోంది. షూటింగ్స్లో బిజీబిజీగా గడుపుతోంది. ముఖ్యంగా ‘రామాయణ’, ‘ది ఇండియన్ స్టోరీ’ వంటి చిత్రాల్లో కాజల్ ప్రధాన పాత్రల్లో కనిపించనుంది.
‘ది ఇండియన్ స్టోరీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది కాజ ల్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం విషయంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. “ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికంలో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది.
ఇప్పుడు సినిమా రంగం చాలా వరకు కార్పొరేట్ స్టైల్లోకి మారడం వల్ల పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇద్దరి జీతాల మధ్య పోలికే లేదు. నేను అమ్మనయ్యాక షూటింగ్స్ చేయడం మరింత సవాలుగా మారింది. పని ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్లాల నిపిస్తుంది. అందుకే నేను రోజుకు ఒకే షిఫ్ట్, అంటే కేవలం 9 గంటలు మాత్రమే పని చేస్తానని నా అగ్రిమెంట్లో రాసి పెట్టుకుంటా. కొన్నిసార్లు కొంచెం అటు ఇటు అయినా.. వీలైనంత వరకు ఫిక్స్ టైమింగ్స్ పాటిస్తా.
ఈ వివక్షపై ఇంకా చాలా మంది నటీనటులు మాట్లాడాల్సిన అవసరం ఉంది” అని తెలిపింది. ఇక ఇటీవ ల జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలపైనా కాజల్ స్పందించింది. “సౌత్లో ఎవరూ 9 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయించుకోరు. నా కెరీర్ ఇక్కడే ప్రారంభం కావడం వల్ల నాకు సౌత్ ఇండస్ట్రీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. బాలీవుడ్లో లేని కంఫర్ట్, పంక్చువాలిటీ ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు చాలా గౌరవం ఇస్తారు” అని చెప్పుకొచ్చిందీ చందమామ.






