ఇలా అయితే ఎలా?

29-04-2024 12:26:03 AM

అహ్మదాబాద్: టీ20 క్రికెట్‌లో  చిన్న మైదానాలు, ఫ్లాట్ పిచ్‌ల వల్ల బౌలర్లకు ఉపయోగం లేకుండా పోయిందని టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో తయారు చేస్తోన్న ఫ్లాట్ పిచ్‌ల కారణంగా 250 ప్లస్ స్కోర్లు సులువుగా ఛేదించేస్తున్నారని.. బౌలర్లకు ఇది ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లోనే 250 ప్లస్ స్కోర్లు ఎనిమిది సార్లు నమోదయ్యాయి. ఇక ఫ్లాట్  పిచ్‌లకు తోడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అదనం. ఫ్లాట్ వికెట్లపై బంతిని స్వింగ్ చేయడం అసాధ్యం. ఇలా అయితే బౌలర్లు వికెట్లు ఎలా తీయగలరు. ఈ సీజన్ బౌలర్లకు చాలా కఠినంగా మారిపోయింది’ అని పేర్కొన్నాడు. ఇక సిరాజ్ ఈ సీజన్‌లో బెంగళూరు తరపున 9 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.