20-07-2025 12:06:22 AM
మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలతోపాటు పాప్కార్న్, కూల్డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం సగటు ప్రేక్షకుడిని నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ విషయంలో సినీపరిశ్రమ కూడా గుర్రుగా ఉంది. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ టికెట్ రేట్లు, పాప్కార్న్ ధరల విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “టికెట్ ధరలపై పరిమితి విధించాలి. దానికంటే పెద్ద సమస్య పాప్కార్న్, కూల్డ్రింక్స్.. దారుణమైన రేట్లకు అమ్ముతున్నారు.
ఇటీవల నేను ఒక సినిమాను థియేటర్లో చూశా. ఆ షో కంటే స్నాక్స్ కోసమే ఎక్కువ ఖర్చుపెట్టా. బిగ్స్క్రీన్పై ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించేలా చేయాలంటే దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ను కోరుకుంటున్నా.
కనీసం వాటర్ బాటిల్స్ అయినా లోపలికి తెచ్చుకోనివ్వండి” అని రాసుకొచ్చారు. నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ సినిమాల్లో నటిస్తున్నారు. చూడాలి మరి.. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తామంటూ, ప్రత్యేక కమిటీ వేశామంటూ చెప్తున్న సినీప్రముఖులు.. ఇంకెంత కాలానికి తమ మాట నిలబెట్టుకుంటారో!