11-08-2025 09:59:35 PM
మంథనిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్..
మంథనిలో విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్..
మంథని (విజయక్రాంతి): మంథని ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గోదావరిఖని ఏసిపి మడత రమేష్(ACP Madatha Ramesh) అన్నారు. సోమవారం మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. మంథని ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మత్తు పదార్థాల రవాణకు మైనర్లను ప్రోత్సాహించి మహారాష్ట్ర నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారని, భవిష్యత్ తరాలను నాశనం చేసే మత్తు పదార్థ్యాల విక్రయించినా, సేవిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసుశాఖకు ప్రజలు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
మహారాష్ట్ర నుంచి గంజాయిని మంథనికి ప్రాంతానికి అక్రమంగా దిగుమతి చేసుకొని అమ్మకాలు చేస్తాన్నారనే సమాచారంతో మంథని సమీపంలోని గాడుదులగండి వద్ద మాటు వేసి మంథని కి చెందిన బండారి అభిషేక్, అలియాస్ అంజి, (19) మంథని మండలంలోని సూరయ్య పల్లికి చెందిన కోరవేరి రవిసాగర్ (23), మంథని మండలం లోని కొవ్వూరి అజయ్ కుమార్ అలియాస్ చింటూ (30) నిందితులను అదుపులోకి తీసుకున్నామని, నిందితుల వద్ద రెండు కేజీల 23 గ్రాములు గంజాయి, రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్ లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తు, వారిని సక్రమమైన పద్దతిలో పెంచాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు అనుమానవస్తే తక్షణమే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇస్తే కౌన్సిలింగ్ నిర్వహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి మా వంతు సహకారమందిస్తామని ఏసీపీ తెలిపారు. ఎంతో చాకచక్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్న మంథని ఎస్ఐ డేగ రమేష్, సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ సమావేశంలో గోదావరిఖని సీఐ ప్రసాద్ రావు, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.