గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి
ప్రాణాలు తీసిన చేపల వేట
చేతికొచ్చిన కొడుకులు మృత్యువాత
ఇబ్రహీంబాగ్లో అలుముకున్న విషాదఛాయలు
మణికొండ,(విజయక్రాంతి): సరదాగా చేపలు పడదామని వెళ్లిన ముగ్గురు స్నేహితులు(Friends) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గండిపేట జలాశయం(Gandipet Reservoir) దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. చేతికొచ్చిన యువకులు అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో ఇబ్రహీంబాగ్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) ఆదివారం సెలవు దినం కావడంతో గండిపేట జలాశయం వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో దిగిన వారు ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది ఆదివారం రాత్రి నుంచి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నీటిలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




