25 August, 2026 | 1:02 PM

పద్మానగర్ సబ్‌స్టేషన్ వద్ద పిడుగు

18-10-2024 02:54 AM

. విద్యుత్ సరఫరాకు అంతరాయం

కరీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి):  కరీంనగర్‌లో గురువారం తెల్లవా రుజామున భారీవర్షం కురిసింది. పట్టణ సమీపంలోని పద్మానగర్ వద్ద ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఉదయం 5 గంటల సమయంలో పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పిడుగు సబ్‌స్టేషన్ పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. మంటల కారణంగా రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అదే పిడుగు సబ్ స్టేషన్‌పై పడిఉంటే పరిస్థితి భయానకంగా ఉండేదని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 5.60 సెంటీమీటర్లు, కొత్తపల్లి సమీపంలోని చింతకుంటలో 3.63 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.