20-02-2026 12:31:26 AM
భయాందోళనలో గ్రామీణ ప్రజలు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి):జిల్లాలో పులి సంచారం రోజురోజుకీ ఉధృతమవుతుంటే, అటవీశాఖ చర్యలు మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి పులి దాడిలో మూడు ఆవులు, ఒక లేగదూడ మృతి చెందిన ఘటనతో గ్రామాల్లో భయం చెలరేగింది.అయితే ఘటన జరిగి రోజులు గడిచినా పులి జాడను ఖచ్చితంగా గు ర్తించలేకపోవడం అధికారుల సామర్థ్యంపై సందేహాలు రేకెత్తిస్తోంది.
ఘటనాస్థలంలో పాదముద్రలు ఉన్నాయని చెబుతు న్న అధికారులు,అది ఎటు వెళ్లిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నా ఫలితం మాత్రం శూన్యం. మహారాష్ట్ర నుంచి అనుభవజ్ఞులైన రెస్క్యూ సిబ్బంది వచ్చారనే సమాచారం ఉ న్నా, ఇప్పటివరకు పులిని గుర్తించడంలో పురోగతి కనిపించడం లేదు.గురువారం మధ్యాహ్నం తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె అటవీ ప్రాంతంలో, మానేరు పరిసరాల్లో కూడా పులి జాడలు కనిపిస్తున్నాయని సమాచారం. పక్క జి ల్లా సిద్దిపేటలో కూడా సంచారం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒకటే పులి జిల్లాల మధ్య తిరుగుతోందా? లేక మరిన్ని పులులున్నాయా? అన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.పశువులు వరుసగా బలవుతున్నా, రైతులకు పరిహారం ప్రకటించడంలో కూడా స్పష్టత లేదు. రాత్రి వేళల్లో గ్రామాలు భయంతో మూగబోయే పరిస్థితి నెలకొంది. పిల్లలను బయటకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.
ప్రజల భద్రత కంటే ప్రకటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పులిని పట్టుకునే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎక్కడ? ప్రత్యేక బృందాలు నిజంగా పనిచేస్తున్నాయా? లేక కేవలం గాలింపు పేరుతో కాలక్షేపమా? ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిన తర్వాతే చర్యలు వేగవంతమవుతాయా? అన్న ప్రశ్నలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.