స్థలాల రిజిస్ట్రేషన్లకు మంత్రికి వినతి
మంత్రి పొంగులేటిని కలిసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్
కూకట్పల్లి, మే 23 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ పరిధిలోని ఐడీపీఎల్ వర్కర్స్ కోపరేటివ్ సొసైటీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలోని ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, రిజిస్ట్రేషన్ అయివున్న స్థలాలకు నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కలిసి విన్నవించారు. సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసంతనగర్ పరిధిలోని 145, 163 సర్వే నంబర్లలో గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం లేదని దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 40 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న స్థానికులకు రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి స్వయంగా అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉందో తెలుసుకొని పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని బండి రమేష్ తెలిపారు.






